Monsoons: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు భారీ ఉష్ణోగ్రతలు జన జీవనాన్ని ఇబ్బంది పెడుతుండగా, మరోవైపు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్) సాధారణం కంటే ముందుగా కేరళను తాకనున్నట్లు వెల్లడించింది.వాతావరణ శాఖ ప్రకారం, నైరుతి రుతుపవనాలు మే 27వ తేదీన కేరళ తీరాన్ని చేరనున్నాయి. అంతేకాక, రాబోయే మూడు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులను కూడా ఈ పవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ ముందస్తు రాక వల్ల దేశవ్యాప్తంగా వర్షాకాలం సాధారణం కంటే తొందరగా ప్రారంభం కానుంది. అయితే రాబోయే రెండు రోజుల్లో వాతావరణం మరింత ఉద్ధృతంగా మారనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తీర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.