– నిన్న హరీశ్పై విరుచుకుపడిన హన్మంత్ రావు
– ఇండిపెండెంట్గా పోటీ చేస్తామంటూ ప్రకటన
– తాజాగా వెనక్కి తగ్గిన మైనంపల్లి
– బీఆర్ఎస్లోనే కొనసాగాలని నిర్ణయం!
– టికెట్ రావడంతో మల్కాజిగిరి సెగ్మెంట్ లో అనుచరుల సంబురాలు
ఇదేనిజం, హైదరాబాద్: మైనంపల్లి హన్మంత్ రావు నిన్న (సోమవారం) తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. తనకు తన కుమారుడికి గనక టికెట్ ఇవ్వకకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తామంటూ ప్రకటించారు. ఇక మంత్రి హరీశ్ రావుపై సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి కామెంట్స్ ను కేటీఆర్ సైతం ఖండించారు. తాము హరీశ్ రావుకు అండగా ఉంటామంటూ ప్రకటించారు. తిరుమలలో మైనంపల్లి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం ప్రకటించిన బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లో మాత్రం మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన పేరు ఉంది. మరోవైపు పార్టీ అసంతృప్తుల విషయంలో కేసీఆర్ సైతం కాస్త సీరియస్గానే స్పందించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఉపక్షించబోమన్నారు. అయితే మైనంపల్లి మీద వేటు పడబోతున్నదని.. మల్కాజిగిరి స్థానంలో పోటీ చేసేందుకు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి రెడీగా ఉన్నారని కూడా ప్రచారం సాగింది. కానీ చివరకు ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు.
వెనక్కి తగ్గిన మైనంపల్లి..
సోమవారం ఉదయం తీవ్ర కోపంగా కనిపించిన మైనంపల్లి సాయంత్రానికి చల్లబడ్డారు. తాను బీఆర్ఎస్ లో కొనసాగబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆయన అనుచరులు సంబురాలు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మైనంపల్లి కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. సహజంగా బీఆర్ఎస్ నేతలెవరూ అధిష్ఠానాన్ని ధిక్కరించి పెద్దగా కామెంట్స్ చేయరు.. ఒకవేళ చేసినా ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండరు. కానీ మైనంపల్లి మాత్రం నిన్న సాహసించి పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. కేసీఆర్ కూడా ఆయన వ్యాఖ్యలను లైట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో చివరకు మైనంపల్లి వివాదం సద్దుమణిగింది. మరి మైనంపల్లి తన కుమారుడు రోహిత్ ను ఇండిపెండెంట్ గా బరిలో దించుతారా? లేదా? అన్న విషయం వేచి చూడాలి.