– ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరిక
ఇదేనిజం, పటాన్ చెరు : బీఆర్ఎస్ నుంచి పటాన్ చెరు టికెట్ ఆశించి భంగపడి ఆ పార్టీకి రాజీనామా చేసిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్గా నీలం మధు పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో పటాన్ చెరు సెగ్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నీలం మధు.. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే పటాన్చెరు టికెట్ కేటాయించింది. దీంతో నీలం మధు రెబల్గా మారి పార్టీకి రాజీనామా చేశారు. తన వర్గంతో రాష్ట్రంలోని ముదిరాజ్లను ఏకం చేసి, టికెట్ ఇవ్వాలని సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ పునరాలోచిస్తుందని భావించాడు. అయినా, బీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పటాన్ చెరు టికెట్ను మధు ఆశిస్తున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.