తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థి ఈరోజు మరణించింది. సీఎం రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ను వెంటాడుతది అని హరీష్ రావు తెలిపారు. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే జవాబుదారీ అని అన్నారు. ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు సీఎం రేవంత్ రెడ్డి… ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది అని అన్నారు. వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం… ఇలా అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది అని నిలదీశారు. నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ సర్కారు పూర్తి వైఫల్యం చెందింది. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేసారు.