– హాజరైన నందమూరి ఫ్యామిలీ, టీడీపీ అధినేత చంద్రబాబు
– దేవర షూటింగ్ వల్లేనా?
– టీడీపీ అభిమానుల మండిపాటు
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పేరిట కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 నాణేన్ని విడుదల చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ కూతురు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. దేవర షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే ఈ ప్రోగ్రామ్ కు రాలేకపోయారని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. కాగా జూనియర్ ఈ కార్యక్రమానికి వెళ్లకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా రోజులుగా టీడీపీ.. తారక్ మధ్య కోల్డ్ వార్ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సైతం తారక్ వెళ్లకపోవడం గమనార్హం. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.