ఓబులాపురం మైనింగ్ కేసు భారతదేశంలో అత్యంత సంచలనాత్మకమైన అక్రమ మైనింగ్ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ బారన్ గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల పాటు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధించిన విషయం మనకు తెలిసిందే. ఈ కేసు కేవలం అక్రమ గనుల తవ్వకం, ఆర్థిక నష్టాల గురించి మాత్రమే కాదు, స్థానిక సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలను కూడా కలిచివేసిన ఒక వివాదాస్పద ఘటన. ఇందులో ఒక ముఖ్యమైన అంశం సుంకులమ్మ గుడి ధ్వంసం.
ఓబులాపురం ప్రాంతంలో సుంకులమ్మ అనే దేవత గుడి ఉండేది. ఈ గుడి స్థానిక గ్రామస్తులకు అత్యంత పవిత్రమైనది. అయితే, మైనింగ్ కార్యకలాపాల సమయంలో, గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని OMC సంస్థ కొండలను తవ్వడంలో భాగంగా మదంతో అడ్డొచ్చిన ఈ గుడిని కూడా ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సుంకులమ్మ గుడి ధ్వంసం కేవలం ఒక భౌతిక నిర్మాణం కూల్చివేత మాత్రమే కాదు, స్థానిక సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలపై దాడిగా భావించారు. స్థానికుల నమ్మకం ప్రకారం, ఈ పవిత్ర గుడిని కూల్చడం వల్ల దేవత శాపం గాలి జనార్దన్ రెడ్డిపై పడిందని, అందుకే అతను ఈ కేసులో ఇన్ని కష్టాలు, నరకయాతనలు అనుభవిస్తున్నాడని చెబుతారు.