హైదరాబాద్: తాత ముత్తాతలు వాడిన పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా.. నేషనల్, షార్ప్, పానాసోనిక్, మర్ఫీ, సాలిడాయిర్, డయానోరా కంపెనీ రేడియోలు, టీవీలు, టేప్ రికార్డర్లు కావాల్నా.. ఇలా పాత తరం ఎలకా్ట్రనిక్ వస్తువులు, కెమెరాలు చివరకు చార్జింగ్లైట్లు ఉన్న మీరు కోటీశ్వరులు అయిపోతారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీటిల్లో ద్రవంతో కూడిన ఎలకా్ట్రనిక్ కాయిల్ ఉంటుందని.. దానికి రూ. వంద కోట్ల వరకు డిమాండ్ ఉందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వీటితో కరోనాకు మందు తయారు చేస్తున్నారని, నాసాలో అత్యవసరంగా ఆ లిక్విడ్ కావాలని.. ఇలా ఎవరికీ తోచింది వారు పోస్టులు పెడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. వీటిని నమ్మిన అమాయకులు రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలని పాత సామాను దుకాణాలు, పాత సమాన్లు అమ్మే మార్కెట్ల(జుమ్మెరాత్ బజార్, మదీనా ఆదివారం మార్కెట్, నాంపల్లి మార్కెట్, రాణిగంజ్, సికింద్రాబాద్, ఎర్రగడ్డ)ను జల్లెడ పడుతున్నారు. ఇదే అదనుగా సెకండ్ సెల్స్ సైట్స్ లలో మోసాలకు తెగబడుతున్నారు. వీటి మాయలో పడిన కొందరు లక్షలు వస్తాయన్న భ్రమలో వేలుపోసి పాత పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటున్నారు. తమ వద్ద పాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయని, అందులో కాయిల్ ఉందని ఎవరైనా కొంటారా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పకపోవడం విశేషం.