ఇదే నిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్ : ఈ నెల 25 నుంచి మే రెండు వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించవద్దని, పరీక్ష రాసే వారితోపాటు ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చూడాలన్నారు. నిబంధనలను అందరూ పాటించాలని, పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ఎస్ఎస్ సీకి సంబంధించిన పరీక్ష కేంద్రాలు కరీంనగర్లో రెండు, హుజురాబాద్ లో ఒకటి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు కేంద్రాల్లో 475 మంది పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు.
అదే విధంగా ఇంటర్ కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు కరీంనగర్ లో మూడు, హుజురాబాద్ లో రెండు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో 881 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. బస్సుల సౌకర్యం కల్పించాలని, దీంతో పాటు విద్యుత్ కు అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ఎండాకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది మందులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు తీసుకెళ్లే సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్ఓ పవన్ కుమార్, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డీఈసీ మెంబర్ అశోక్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.