ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతుల అకౌంట్లలో వెంటనే రైతు భరోసా జమ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఓ వైపు వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా నిధులు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ దఫా ఎకరాకు రూ. 7500 జమ చేయాలని కోరారు. రాష్ట్రంలో పామాయిల్ సాగును కూడా ప్రోత్సహించాలని కోరారు. వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలోరైతు నాగేందర్ కోరిక మేరకు మొదటి పంటను మాజీ మంత్రి హరీశ్రావు కోశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం రైతుకు ఏడాదికి రూ.4200 ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో పామాయిల్ పంటపై రైతులు ఆసక్తి చూపించడం లేదని హరీశ్రావు అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న రైతు భరోసా నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పచ్చిరొట్ట, జిలుగ, జనుము విత్తనాల సరఫరా చేయని దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన నిదులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. దగా చేయడం మంచిది కాదని హితవు పలికారు.