– జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
– కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం
– పాలమూరు టికెట్ అరుణకు దక్కడంతో అసంతృప్తిలో జితేందర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లోక్సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి గురువారం జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు సమాచారం. దీంతో, ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయనకు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్రపెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది.