ముంబాయిః దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు నేపథ్యంలో డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టయిన సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తిని పోలీసులు ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన మేజిస్ట్రేట్ రియాకు బెయిలును తిరస్కరించి 14 రోజుల పాటు రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. ముంబైలో మహిళలకు ఉన్న ఏకైక జైలు బైకుల్లా జైలు. ఈ జైలులోనే కోరీగావ్-భీమాలోని షీనా బోరా హత్య కేసలో ప్రధాన నిందితులుగా అరెస్టు అయిన ఇంద్రాణి ముఖర్జీయా, కార్యకర్త సుధా భరద్వాజ్ సహా మరి కొందరు మహిళ ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
డ్రగ్స్ కేసు రుజువైతే రియాకు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కొందరు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన మూడు రోజుల విచారణలో రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉందని, ఆమె సిండికేట్ సభ్యురాలుగా ఉన్నట్లు తేలింది. రియా డ్రగ్స్ దందాలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారని 25 మంది పేర్లు, డ్రగ్స్ ఉపయోగించే పార్టీల జాబితాను ఎన్సీబీకి ఇచ్చిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సహాయంతో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.