సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మణప్పురం గోల్డ్ లో రుద్దుడు దోపిడి కలకలం రేపింది. ఇక్కడ కుదువ పెట్టిన బంగారాన్ని 40 రోజుల్లో 8 సార్లు రుద్ది రుద్ది అరగదీయడంతో పాటు నగను చెడగొట్టారని ఎర్రంశెట్టిగూడెం గ్రామానికి చెందిన నాగబ్రహ్మచారి శనివారం మణప్పురం గోల్డ్ లోన్ సంస్థ ముందు ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. తాను తయారు చేసిన మంగళసూత్రం తాడు సుమారు మూడున్నర తులాలును మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో పెట్టి రూ.1,70,000 రుణంగా తీసుకున్నట్లు తెలిపారు. 40 రోజుల తర్వాత వినియోగదారుడికి బంగారు నగను ఇద్దామని గోల్డ్ లోన్ సంస్థకు విడిపించేందుకు వెళ్లానని, సంస్థ రుణం మొత్తం కట్టి నగను విడిపించుకుని వెళ్లి చూస్తే మొత్తం ఎనిమిది చోట్ల రుద్దినట్టు కనిపించిందని తెలిపారు. సంస్థ వద్దకు వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆయన అన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తనకు తగిన న్యాయం చేయాలని కోరారు.