మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దాదాపు ఖాయమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి సీట్లు గెలుచుకునే దిశగా సాగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. అయితే అధికారంలోకి రావాలంటే 145 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహాయుతి కూటమి 220కి పైగా స్థానాల్లో ముందజలో ఉంది. కానీ చాలా ఎగ్జిట్ పోల్స్ ఈ సంఖ్యను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. కానీ కేకే సర్వే మాత్రం ఈ ఫలితాలకు దగ్గరగా అంచనాలు వేసి మరోసారి తమ సర్వే నెంబర్ 1 అని నిరూపించుకుంది.
2024 మహారాష్ట్ర – జార్ఖండ్ ఎన్నికలు పోలింగ్ పూర్తయిన వెంటనే, అనేక సర్వే సంస్థలు తమ తమ నివేదికలను ప్రకటించాయి. అయితే అన్ని సర్వేలు కంటే ఎక్కువగా కేకే సర్వే చెప్పినట్టే జరిగింది. మహారాష్ట్రలో మహాయుతి గెలుస్తుంది అని కేకే సర్వే అంచనా వేసింది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అని తెలిపింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 225 సీట్లు గెలుచుకుంటుందని కేకేసర్వే స్పష్టం చేసింది. మహా వికాస్ అఘాడి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని తెలిపింది. మహా వికాస్ అఘాడికి 56 నియోజకవర్గాలకు మించి సీట్లు రావు అని తెలిపింది. ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించవచ్చని కేకే సర్వే పేర్కొంది. గతంలో ఆంధప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని కేకే సర్వే ముందగానే ప్రకటించింది. ఏపీలో అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.