HomeతెలంగాణKTR : గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడుతున్నా..

KTR : గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడుతున్నా..

  • గవర్నర్ ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం
  • ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని విమర్శలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం విని సిగ్గుపడుతున్నానని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని మండిపడ్డారు. ఓ సభ్యుడిగా ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే విని ఉండమన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థమైపోతుందన్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామన్నారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు. ‘ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసం చేయనని, ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు’.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని, గవర్నర్ ప్రసంగం కూడా అలాగే అనిపించిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనన్నారు.

Recent

- Advertisment -spot_img