Sharmila : జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారు.. ఇప్పుడు ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారు అని షర్మిల అన్నారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు అని.. జనసేనా పార్టీని “ఆంధ్ర మతసేనా” పార్టీగా మార్చారు అని షర్మిల ఆరోపించారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం అని అన్నారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం అని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ గారు ఇప్పటికైనా మేల్కోండి.. బీజేపీ మైకం నుంచి బయట పడండి అని షర్మిల సలహా ఇచ్చారు.