ట్విటర్లో శశి థరూర్ ఎద్దేవా.. ‘ది నేమ్ ఛేంజర్స్’ కార్టూన్ షేర్
న్యూఢిల్లీ: ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ట్విటర్లో ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర డాటా లేదని అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు.
లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ పార్లమెంట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు.
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’
RELATED ARTICLES