– వెల్లడించిన సుప్రీంకోర్టు
– పిటిషన్పై విచారణకు నిరాకరించిన
అత్యున్నత న్యాయస్థానం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతో పాటు ఆ ప్రాంతంలో గోడ నిర్మించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయ్యింది. తాజాగా ఈ పిల్ను పరిశీలించిన సుప్రీం ధర్మసనం.. విచారించేందుకు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్ను తోసిపుచ్చింది. రామసేతు ప్రాంతంలో గోడ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ హిందూ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అశోక్ పాండే సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్ పెండింగులో ఉందని గుర్తుచేసిన ఆయన.. ఆ పిటిషన్తో దీన్ని కూడా జతచేయాలని కోరారు. తాజా పిటిషన్ను మంగళవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనం పరిశీలించింది. ‘గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుంది. ఇది పాలనాపరమైన వ్యవహారం. దీన్ని మేమెందుకు చూడాలి’ అని పేర్కొంది. అంతేకాకుండా జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన పిల్తో దీన్ని జత చేయాలని పిటిషనర్ కోరినప్పటికీ.. అందుకు కూడా సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలోనే ఓ పిల్ దాఖలు చేశారు. స్మారక చిహ్నమా? కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్లతరబడి నాన్చుతోందని తన పిటిషనులో ఆక్షేపించారు. గతేడాది నవంబరులో దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకొహ్లీ, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక అడమ్స్ బ్రిడ్జ్గా పిలిచే ఈ రామసేతుకు సంబంధించి అనేక అంశాలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.