నాందేడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ సాగింది. చివరి క్షణం వరకు విజయం దోబూచులాడుతూ వచ్చింది. ఈ హోరాహోరీ పోరులో ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సంతుక్రావ్ హంబర్డే, కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంతరావు మధ్య వందల ఓట్ల తేడా మాత్రమే ఉంది. రౌండ్ ముగిసే సరికి ఆధిక్యం తగ్గుముఖం పట్టడంతో అభ్యర్థులు, పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగింది. ఒక స్థాయిలో 400 ఓట్ల తేడా కనిపించింది. మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి సంతుక్రావ్ మరోత్రావ్ హంబర్డే చివర్లో వెనకబడిపోయారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంతరావు కేవలం 1,457 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ హఠాన్మరణంతో నాందేడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో విజయం సాధించడంపై కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించారు. కానీ అదే రాష్ట్రంలోని నాందేడ్ లోక్ సభ స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. అయితే ఈ విజయంతో కాంగ్రెస్ ఇజ్జత్ నాందేడ్ కాపాడిందని చెప్పొచ్చు.