న్యూఢిల్లీః ఆర్య సమాజ్ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) గుండెపోటుతో మరణించారు. ఆయన గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్బీఎస్)లో చేరారు. అక్కడ నాలుగురోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
1939 సెప్టెంబర్ 21న ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో తాత వద్ద పెరిగారు. కోల్కతాలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి లా, కామర్స్లో పట్టా పొందారు. ఆర్య సమాజ్ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించి, 1977లో హరియాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగానూ సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ను స్థాపించారు. మావోయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు. 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా పదేళ్ల పాటు (2004-2014) కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన విశేష కృషి చేసిన విషయం తెలిసిందే.
గుండెపోటుతో మరణించిన స్వామి అగ్నివేశ్
RELATED ARTICLES