Telangana Chief Minister KCR expressed outrage that the Andhra Pradesh government had deliberately taken action in the matter of river waters.
The AP wants to give a bold answer to the arguments of the state at the apex meeting.
నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే కయ్యం పెట్టుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ రాష్ర్టం చేస్తున్న వాదనలకు అపెక్స్ సమావేశంలో ధీటైన సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలని సీఎం అన్నారు.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో నీటి పారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం చర్చించనున్నారు.
తెలంగాణ నీటి పారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను కేంద్రానికి తెలపాల్సిన వివరాలను తీసుకుని రావాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కేంద్ర నిష్ర్కియా పరత్వం, ఏడేళ్ల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని సీఎం చెప్పారు.
తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు.
నిజనిజాలను ఈ సమావేశంలో యావత్ దేశానికి తేటతెల్లం చేయాలన్నారు. రాష్ర్టాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ర్టం ఏర్పడితే వెంటనే ఆ రాష్ర్టానికి నీటిని కేటాయించాలి.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే, జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాసి, నీటి కేటాయింపులు జరపాలని కోరాం.
ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షన్ ప్రకారం.. ప్రత్యేక ట్రిబ్యునల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యునల్ ద్వారా అయినా తెలంగాణకు నీటి కేటాయింపులు జరపాలని కోరామని సీఎం గుర్తు చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్యనైనా, లేదంటే నదీ పరివాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ర్టాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరినట్లు కేసీఆర్ తెలిపారు.
ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈనాటికీ స్పందన లేదని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు.. పలుకు లేదు. అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు కానీ కేంద్రం ఏమీ చేయడం లేదని స్పష్టం చేశారు.
వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి.
తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాలి.
తెలంగాణ రాష్ర్టం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.