వనపర్తి జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దిశ చైర్మన్, ఎంపీ పోతుగంటి రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సాగులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రమూ మన దరిదాపులలో లేదన్నారు. 39 శాతం అత్యధికంగా ఈ వానాకాలం సాగయిందని, అభివృద్దిలో మార్గదర్శకంగా నిలవాలన్నారు. పాఠశాలల అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సమస్యలపై దృష్టిసారిద్దామన్నారు మంత్రి.
ఎమ్మెల్యే, ఎంపీ, సీఎస్ఆర్ ఫండ్స్ నిధులతో పూర్తిచేద్దాం ప్రణాళిక సిద్దంచేయాలని మంత్రి సూచించారు. సమస్యలున్న పాఠశాలలు వనపర్తి జిల్లాలో ఉండొద్దని, ఆన్ లైన్ క్లాసులు చూసే అవకాశంలేని విద్యార్థులను గుర్తించి వారికి సౌకర్యం కల్పించాలని, వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాగునీటి రాకతో వ్యవసాయ రంగంలో మోటార్ల వినియోగం పెరగడంతో కరంటు వినియోగం పెరిగిందని, జిల్లాలో మూడువేల కరంటు కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 400 ట్రాన్స్ ఫార్మార్లు త్వరలో రానున్నాయని, కొన్నాళ్లలో మిగిలిన ట్రాన్స్ ఫార్మార్లన్నీ వస్తాయని తెలిపారు.
గ్రామాలు, పట్టణాలలో నిర్మించే ప్రతి ఇంటికి అనుమతి ఉండాలి .. నిర్మించిన ఇళ్లు పన్ను పరిధిలోకి రావాలి, పారిశుధ్యంపై దృష్టి సారించండి, పారిశుద్యం కోసం పంచాయతీలు, మున్సిపాలిటీలలో చేసే ఖర్చును పరిశీలించండని, అవసరమైన పనులు సత్వరం పూర్తిచేయడంపై దృష్టి సారించండని సూచించారు.
మహిళలకు ఉపాధి శిక్షణ అంటే టైలరింగ్ మాత్రమే కాదని, కరంటు, ప్లంబింగ్ ఇతర రంగాలలో మహిళలకు శిక్షణ ఇప్పించాలన్నారు. శాఖల మధ్య సమన్వయం పెరగాలి .. దాంతో పథకాల అమలు, అభివృద్ది వేగవంతం అవుతుంది. అందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి, ఉద్యోగులు, అధికారులే అన్ని పనులు నిర్వహించలేరు అన్నారు మంత్రి. అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అన్నారు. నిరంతరం వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వం గ్రామాలలో ప్రజల వద్దకు వెళ్తుందని, గ్రామాలలో పార్కుల ఏర్పాటులో అటవీశాఖ ఉద్యోగులు ఇబ్బంది పెట్టొద్దు .. అందరికీ సహకరించాలి అని సూచించారు. రైతు ఉత్పత్తి సంఘాల(FPO)ను ఏర్పాటుచేయండన్నారు.
కరోనా నియంత్రణలో కృషిచేసిన వైద్య, పోలీసు, మున్సిపల్ శాఖకు అభినందనలు తెలిపారు. కరోనా విపత్తులో దేశాన్ని నిలబెట్టిన వ్యవసాయ శాఖకు, రైతాంగానికి ధన్యవాదాలు
ఎంపీ, దిశ చైర్మన్ పోతుగంటి రాములు మాట్లాడుతూ గ్రామాలే ఈ దేశ మూలస్తంభాలు అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు .. అధికారులు, ఉద్యోగులుగా అది మీ బాధ్యత అని అధికారులకు సూచించారు. అధికారులను, ఉద్యోగులను జాగృతం చేయడం ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత అని, అంతేగానీ మీతో మాకు వ్యక్తిగత వైరం లేదు .. అలా మీరు భావించవద్దు అని తెలిపారు. గ్రామాలలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయండని, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకోసం శిక్షణా కార్యాక్రమాలు నిర్వహించండని, దిశ మన ప్రాంత అభివృద్దికి దశ – దిశ చూపాలన్నారు. జిల్లా ప్రగతిలో మనందరం భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.