గోదావరికి వరదనీరు వచ్చిందంటే పులస చేపల సందడి మొదలవుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. దీన్ని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి కొనుగోలు చేశాడు.
‘పులస చేప’ ప్రత్యేకత ఇదే..!
గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.