అత్యవసర ప్రయాణాలకు హెలికాప్టర్లు ఉపయోగిస్తూ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్తున్నాం. అదే సమయంలో భద్రతా కారణాలు, పర్యావరణ ప్రతికూలతలు పెనుశాపంగా మారుతున్నాయి. ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, నాయకులు, సెలబ్రిటీలు కానరాని లోకాలకు వెళుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఈ ప్రమాదాలపై మరోసారి చర్చ జరుగుతోంది.
ప్రపంచంలో సంభవించిన ఘోర ప్రమాదాలు..
1968- వియత్నాం- సీహెచ్-53ఏ: వియత్నాం యుద్ధంలో పలు హెలికాప్టర్లు నేలకొరిగాయి. 1968 జనవరి 8న సీహెచ్-53ఏ సీ స్టాలియన్ కూలిన ఘటనలో 46 మంది దుర్మరణం చెందారు.
1977- ఇజ్రాయెల్- సీహెచ్-53డీ సీ స్టాలియన్: జోర్డాన్ వ్యాలీలో 1977 మే 10న సీహెచ్-53డీ సీ స్టాలియన్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 54 మంది మృతిచెందారు.
1981- ఇంగ్లాండ్- వెస్ట్లాండ్ వెసెక్స్ 60 : వెస్ట్లాండ్ వెసెక్స్ 60 హెలికాప్టర్ ఆగస్టు 13, 1981న ప్రమాదానికి గురైంది. దీంట్లో ఇద్దరు పైలెట్లు సహా 13 మంది మరణించారు.
1983- ఇంగ్లాండ్- సికోర్స్కీ ఎస్-61: సెల్టిక్ సముద్రంలో 1983 జులై 16న సికోర్స్కీ ఎస్-61 వాణిజ్య హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు.
1986- స్కాట్లాండ్- బోయింగ్ 234 ఎల్ ఆర్ చినూక్: 1986 నవంబర్ 6న జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ఐరోపా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదం.
1997- ఇజ్రాయెల్- సికోర్స్కీ ఎస్-65సీ-3 : ఆగస్టు 17, 1997న ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది . 73 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
2002- రష్యా- మిల్ మీ-26 : ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక హెలికాప్టర్గా మిల్ మీ-26కు పేరుంది. ఇది రెండో చెచెన్ యుద్ధంలో కుప్పకూలింది. 127 మంది రష్యన్ సైనికులు మరణించారు.
2009- వెనిజువెలా- మిల్ మీ-35 : వెనిజువెలాలోని తాచిరా ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. 17 మంది సైనిక సిబ్బంది మరణించారు.
2020- యూఎస్ఏ- సికోర్స్కీ ఎస్-76బీ : కాలిఫోర్నియాలోని కాలబాసాస్ ప్రాంతంలో 2020 జనవరి 26న ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎన్బీఏ లెజెండ్ కోబే బ్రయంట్ ప్రాణాలు కోల్పోయారు.
2021- భారత్- మిల్ మీ-17 : భారత వాయుసేనకు చెందిన మిల్ మీ 17వీ-5 తమిళనాడులోని కోయంబత్తూరు-వెల్లింగ్టన్ మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13 మంది మరణించారు.
ఇంకా లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి, సినీనటి సౌందర్య వంటి ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు.