Homeఆంధ్రప్రదేశ్సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైంది

సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైంది

– టీడీపీ చీఫ్​ చంద్రబాబుకు బెయిల్​ మంజూరుపై స్పందించిన నారా లోకేశ్​

ఇదే నిజం, ఏపీ బ్యూరో: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైంది. మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యం. చంద్రబాబు నీతి, నిజాయతీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయి. తప్పు చేయను.. చేయనివ్వను.. అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయి. 50 రోజులైనా ఒక్క ఆధారమూ కోర్టు ముందు ఉంచలేకపోయారు. కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు ఓడిపోయాయి. ఈ కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు లేవని తేలిపోయింది. చంద్రబాబు రాజకీయ జీవితంపై మచ్చ వేసేందుకు కుట్ర చేశారని తేలిపోయింది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. అక్రమ కేసులపై తమ పోరాటం ఫలించిందని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైందని చెప్పారు. ఇకనైనా సీఎం జగన్ బుద్ధి తెచ్చుకుని కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తారని అచ్చెన్న తెలిపారు. చంద్రబాబు పూర్తి స్థాయి కార్యక్రమాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ లోపు మిగిలిన కేసుల్లోనూ బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img