– పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి
– సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించిన గులాబీ బాస్
– ఇతర పార్టీల వైపు తుమ్మల చూపు
– పాలేరు టికెట్పై హామీ ఇవ్వని కాంగ్రెస్?
ఇదేనిజం, స్పెషల్ బ్యూరో: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగిన దశాబ్దాల పాటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కానీ ఒకే ఒక్క ఓటమి తుమ్మలను కుంగదీసింది. వచ్చే ఎన్నికల్లోనూ పాలేరు సెగ్మెంట్ నుంచి బరిలో దిగాలని తుమ్మల భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చారు. దీంతో ఇటీవల తుమ్మల అనుచరులు రహస్యసమావేశం నిర్వహించారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే తుమ్మల నాగేశ్వర్ రావు ఏ పార్టీలో చేరబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.
కాంగ్రెస్ నుంచి నో ఆఫర్
తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికకు బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది. ఆయన రాకను పొంగులేటి తీవ్రంగా అడ్డుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు పాలేరు టికెట్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వలేదని దీంతో సమాచారం. దీంతో తుమ్మల నాగేశ్వర్ రావు ఇండిపెండెంట్ గా పోటీచేస్తారని కూడా ప్రచారం సాగుతోంది.
గతంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటినుంచి తుమ్మల పార్టీ కార్యకలాపాలకు దూరంగా, అంటీముట్టనట్టుగా మెలగుతూ వచ్చారు. మధ్యమధ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటూ.. మళ్లీ పాలేరునుంచే పోటీచేస్తానని ఏ పార్టీ తరఫున అనేది ఇంకా నిర్ణయించుకోలేదని రకరకాల సంకేతాలు ఇచ్చారు. మధ్యలో బీఆర్ఎస్ కాస్త పూనుకుని ఆయనను బుజ్జగించింది. అయితే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. సిటింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే మళ్లీ ఇచ్చారు. దీంతో తుమ్మల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో వేచి చూడాలి.