వరంగల్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. జోరుగా కురుస్తున్న వానలతో వరంగల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హన్మకొండలోని పలు కాలనీల్లో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.కొన్ని కాలనీలు రెండు రోజులుగా వరద నీటిలోనే ఉండిపోయాయి. నయీం నగర్లోని ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తూనే ఉంది. నాలాలు కుచించుకుపోవడం, అక్రమ నిర్మాణాల వల్ల వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. నాలాల పక్కన ఉన్న కాలనీల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా కాలనీ వాసులను పునరావాస కాలనీలకు తరలించారు. భద్రకాళి జలాశయంతో పాటు, కట్ట మల్లన్న చెరువు, దేశాయి పేట వడ్డేపల్లి చెరువు, కరీమాబాద్ రంగ సముద్రం మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, సమ్మయ్య నగర్, మైసయ్య నగర్, సుందరయ్య నగర్, లోతుకుంట వీవర్స్ కాలనీ, శివనగర్, ఎస్సార్ నగర్లోని ఇళ్లలోని వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.