Homeహైదరాబాద్latest Newsఏటా 6 లక్షల ఎకరాలకు నీళ్లు.. ఆగస్టు 15న ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్‌ ఇరిగేషన్లను...

ఏటా 6 లక్షల ఎకరాలకు నీళ్లు.. ఆగస్టు 15న ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్‌ ఇరిగేషన్లను ప్రారంభించనున్న సీఎం రేవంత్: మంత్రి ఉత్తమ్

  • స్విచ్ ఆన్ చేసి సీతారామ ట్రయల్ రన్ ప్రారంభం
  • రీడిజైన్‌ పేరుతో బీఆర్ఎస్ హయాంలో రూ.8 వేల కోట్లు వృథా
  • నత్త నడకన సాగిన పనులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఖమ్మం లో సీతారామ ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: సీతారామ ప్రాజెక్టుతో ఏటా 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్ట్ 15న ఈ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్‌ ఇరిగేషన్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి సీతారామ ప్రాజెక్టును పొంగులేటి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్విచ్ ఆన్ చేసి సీతారామ ప్రాజెక్టు పంపుల ట్రయల్ రన్ ప్రారంభించారు.

భద్రాద్రి సీతారామ ప్రాజెక్టుతో ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. గోదావరి జలాలతో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరందిస్తామని చెప్పారు. ఇటీవల చెప్పినట్లుగానే అదేరోజు సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రీడిజైన్‌ పేరుతో బీఆర్ఎస్ హయాంలో రూ.8 వేల కోట్లు వృథా చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

రెండు దఫాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూలూరుపాడు టన్నెల్‌ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయన్నారు. పంప్‌ హౌస్‌ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేస్తామన్నారు. మొదటి పంపు హౌజ్‌ ట్రయల్‌ రన్‌ను గత జూన్‌లో విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. రెండో పంపు హౌజ్‌ ట్రయల్‌ రన్‌ను జులై 2న విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించారు. రైతుల కష్టాలు ఇకపై తొలగిపోయాతాయని అన్నదాతల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే తమ లక్ష్యమన్నారు.

రాజీవ్‌ నగర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, ఇందిరా సాగర్‌లను ఒకే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌గా విలీనం చేసి భద్రాద్రి సీతారాముడి పేరు మీదుగా సీతారామ ఎత్తిపోతల పథకంగా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ ప్రాజెక్టును స్వాతంత్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. గోల్కొండ కోటలో జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాక.. హెలికాఫ్టర్‌ ద్వారా ఖమ్మం జిల్లా వైరాకు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్‌లను స్విచ్ఛాన్ చేసి ప్రారంభిస్తారు. అనంతరం వైరాలో జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img