Homeఅంతర్జాతీయంఈ నెల 13లోగా పార్లమెంట్​పై దాడి చేస్తం

ఈ నెల 13లోగా పార్లమెంట్​పై దాడి చేస్తం

– ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు
– సోషల్​ మీడియా ద్వారా వీడియో రిలీజ్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఈ నెల 13లోగా పార్లమెంట్​పై దాడి చేస్తామంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్‌’ (ఢిల్లీ ఖలిస్థాన్‌గా మారబోతోంది) అనే శీర్షికతో ఆ వీడియో రిలీజ్‌ చేశాడు. ఈ నెల 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్‌ దాడి దోషి అఫ్జల్‌ గురు పోస్టర్‌ను కూడా అందులో ప్రదర్శించాడు. తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని ఈ వీడియోలో పన్నూ పేర్కొన్నాడు. కాగా, ఈ నెల 13వ తేదీ నాటికి పార్లమెంట్‌ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు పూర్తికానుంది. 2001 డిసెంబ్‌ 13న ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్నారు. ఈ నెల 22వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాలు జరుగుతన్న వేళ ఇలా ఖలిస్థాన్‌ ఉగ్రవాది నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. పన్నూ బెదిరింపుల వీడియో బయటకు రావడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.

పార్లమెంట్‌ పరిసరాల్లో సెక్యూరిటీని మరింత టైట్ చేశాయి. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, పన్నూ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదే మొదటి సారి కాదు. నవంబర్‌లో కూడా ఇలానే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎయిరిండియా విమానాన్ని పేల్చేస్తామని, నవంబర్ 19న ఎయిరిండియా విమానంలో ఎవరూ ప్రయాణించవద్దని పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. నవంబర్ 4న విడుదల చేసిన ఓ వీడియోలో పన్నూ మాట్లాడుతూ.. ‘నవంబర్‌ 19న ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్‌పత్వంత్‌ ఆ వీడియోలో హెచ్చరించాడు. అదే విధంగా నవంబర్‌ 19న ఢిల్లీ ఎయిర్​పోర్టును మూసేయనున్నట్టు.. దాని పేరును మార్చనున్నట్టు గుర్‌పత్వంత్‌ చెప్పాడు. అదే రోజు క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ జరుగుతుండటాన్ని గుర్తు చేశాడు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం నుంచి మోడీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్‌లో ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇటీవలే గుర్‌పత్వంత్‌ హెచ్చరికలు చేశాడు.

Recent

- Advertisment -spot_img