న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా మే నుంచి ఆగస్టు మధ్యలో 66 లక్షల ప్రొఫెషనల్స్ ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది. కరోనా దెబ్బకు గత నాలుగేళ్ల కాలంలో కంపెనీలు గడించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయని సీఎంఐఈ స్పష్టం చేసింది. అంతేకాకుండా పరిశ్రమలకు చెందిన 50లక్షల మంది కార్మికులు పని కోల్పోయారని వెల్లడించింది. ప్రతినాలుగు నెలలకొకసారి విడుదలయ్యే కన్జ్యూమర్ పిరమిడ్ హౌస్హోల్డ్ సర్వే ఆధారంగా సీఎంఐఈ ఈ విశ్లేషణ చేసింది. 2019, మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్టంగా 18.8 మిలియన్ల మంది ఉపాధి పొందగా, 2020 మే నుంచి ఆగస్టు మధ్యలో అది 12.2 మిలియన్లకు పడిపోయింది. ఏప్రిల్లో 121 మిలియన్ల ఉద్యోగాలు పోయాయని సీఎంఐఈ గతంలో అంచనా వేసింది. వాటిలో కొన్ని ఉద్యోగాలు ఆగస్టు నాటికి తిరిగి పొందినా, జీతాలు పొందే ఉద్యోగుల పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని నివేదిక వెల్లడించింది.