Homeజాతీయం#Crime : 8 నెలలు బంధీగా మహిళ.. విషయం తెలిసి గ్రామస్థులు షాక్

#Crime : 8 నెలలు బంధీగా మహిళ.. విషయం తెలిసి గ్రామస్థులు షాక్

వరకట్నం చట్టరీత్యా నేరమైనా తమ కుమార్తెలు అత్తింటిలో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ తాహతకు మించి పెళ్లి సమయంలో ముట్టజెబుతున్నా కొందరికి దాహం తీరడం లేదు.

అదనపు కట్నం కోసం కోడల్ని అత్తింటివాళ్లు వేధించి.. ఆమెను ఎనిమిది నెలలు ఇంట్లో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఉదంతం బీహార్‌లోని సుపౌల్‌లో జిల్లాలో చోటుచేసుకుంది.

కిసాన్‌పూర్‌లో ఒక వివాహితను అత్తింటివాళ్లు బంధించిన విషయం తెలిసిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగుచూసింది.

మహిళా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందజేయడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్ర‌మీలా కుమారి సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆమెకు విముక్తి కలిగించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. కిసాన్‌పూర్‌కు చెందిన‌ విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన మోనా అనే యువ‌తితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది.

మార్చి 7, 2018న పెళ్లి స‌మ‌యంలో కట్నంగా రూ. 17 లక్షలు, కారుతో పాటు లాంఛనాలను సంజయ్‌కు మోనా తండ్రి ముట్టజెప్పారు.

పెళ్లి తర్వాత దంప‌తులు కిసాన్‌పూర్‌లో కాపురం పెట్టారు. వీరికి ఓ పాప ఉండగా.. ఆమెకు ప్రస్తుతం ఏడాదిన్నర వ‌య‌సు.

అయితే కొంత‌కాలంగా అత్తింటివాళ్లు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారు.

పుట్టింటి నుంచి మరో రూ.10 లక్షల కట్నం తీసుకురావాల‌ని చిత్రహింసలకు గురిచేశారు.

వారు కోరినంత మొత్తాన్ని బాధితురాలు తీసుకురాక‌పోవ‌డంతో భ‌ర్త‌, అత్తామామ‌లు క‌లిసి ఓ గదిలో బంధించారు.

ఆమె ఎనిమిది నెల‌లుగా ఆ గ‌దిలోనే బంధీగా ఉన్న విషయం గ్రామస్థులకు ఆల‌స్యంగా తెలిసింది.

ఈ విషయ గురించి మహిళా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు.

గ్రామ‌స్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీస్ అధికారి.. గది తాళాలను పగులగొట్టి బాధితురాలిని బయటకు తీసుకొచ్చారు.

ఆమె వాంగ్మూలం నమోదు చేసి.. దీని ఆధారంగా అత్తామామలు, భర్తపై వరకట్న వేధింపుల కేసును న‌మోదు చేశారు.

ద‌ర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని, నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి ప్రమీల కుమారి తెలిపారు.

బాధితురాలిని గదిలో బంధించిన విషయం తెలిసి పోలీసులతో పాటు వందల మంది గ్రామస్థులు అక్కడకు చేరుకుని గుమిగూడారు.

బాధితురాలి తండ్రి గౌరీ శంకర్ చౌధురి మాట్లాడతూ.. నా కుమార్తె ఎలా ఉందో చూసిరావాలని నా కొడుకును పంపాను.. ఆమెను కలిసేందుకు అత్తింటివాళ్లు అనుమతించలేదు.

ఈ విషయం గురించి గ్రామస్థులకు చెప్పడంతో వారు పోలీసులను తీసుకొచ్చిన తాళాలు బద్దలుకొట్టారని తెలిపారు.

మోనా బీటెక్ పూర్తిచేసింది. అత్తమామలు సంజయ్ చౌధురి, అభా దేవి, ఆడపడుచులు రాఖీ కుమారి, చాంద్నీ కుమార్‌లు, భర్త సంజయ్‌ను కూడా నిందితులుగా పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img