Nizamabad : నిజామాబాద్ జిల్లా బోధన్లో గుండెలు పిండేసే ఘటన జరిగింది. కారులో ఊపిరాడక ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6) తల్లితో కలిసి ఈనెల 5న రాకసిపేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా.. కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. బాలుడు కనిపించకపోయే సరికి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే రెండు రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియాలో పార్క్ చేసిన ఓ కారులో విగతజీవిగా కనిపించాడు. కారు డోర్లు తెరచుకుని ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే.. కారు ఒక్కసారిగా లాక్ అయింది. దీంతో ఆ చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడు. గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా.. కారులో మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహం మిస్సైయిన రాఘవదిగా గుర్తించారు