ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనమంతా స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో వారి నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తుంది. సాధారణ ఛార్జీల కంటే అధికంగా వసూలు చేస్తుంది. అందేంటని ప్రశ్నిస్తే స్పెషల్ బస్సు అని సమాధానం చెబుతున్నారు. సిటీ బస్సులను పలు రూట్లలో నడిపిస్తూ ఒక్కొక్కరికి రూ. 50 నుంచి రూ.100 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పైగా బస్సులపై స్పెషల్ బస్సులని బోర్డు పెట్టడం లేదు. తీర ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత ఇది ప్రత్యేక బస్సు అని చెప్పి ఎక్కువ డబ్బులు లాగుతున్నారు. ఈ తతంగంపై ఆర్టీసీ అధికారులను ఆరా తీయగా.. ప్రత్యేక బస్సులకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో ఇలా ఛార్జీల పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ అధికారులను, ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.