– చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను వెనక్కి తేవడంపై ఫోకస్ పెట్టిన ఇస్రో
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై ఫోకస్ పెట్టింది. ఇటీవల చంద్రయాన్-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ అనుకున్న దాని కంటే అధిక ఫలితాలను భారత్కు అందించినట్లైంది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారాన్నిమంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది. కక్ష్య పొడిగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీన్ని పూర్తిచేసినట్లు వెల్లడించింది. భారత్ ప్రొపల్షన్ మాడ్యుల్ మార్గాన్ని తెలివిగా ప్లాన్ చేయడంతో.. దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది.
దీనిని వాడుకొని మరికొన్ని పరిశోధనలు పూర్తిచేశారు. అనంతరం చంద్రుడి కక్ష్య నుంచి దీని మార్గాన్ని భూకక్ష్య వైపు మళ్లించారు. దీనిపై ఉన్న షేప్ పేలోడ్ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్లోకి ప్రవేశించే సమయంలో, దిగువ కక్ష్యలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా అక్టోబర్లోనే పక్కగా ప్లాన్ చేశారు. చంద్రయాన్-3లోని మూడు ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్ మాడ్యుల్ కూడా ఒకటి. ఇది కాకుండా ల్యాండర్ మాడ్యుల్, రోవర్ ఉన్నాయి. ఇక ప్రొపల్షన్ మాడ్యుల్తో ల్యాండర్ మాడ్యుల్ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్ మాడ్యుల్ను చంద్రుడికి 100 కి.మీ. సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యుల్ కొన్ని నెలల పాటు కక్ష్యలోనే ఉంది. దీనిలోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి సైంటిస్టులకు పంపింది.