– నామినేటెడ్ పదవుల కోసం లీడర్ల వెయిటింగ్
– మొదలైన మంథని నేతల పైరవీలు
– ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇంటికి క్యూ
ఇదే నిజం, భూపాలపల్లి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో కొందరు ద్వితీయశ్రేణి లీడర్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో టికెట్ దక్కని లీడర్లు ఈ లిస్ట్ లో ఉన్నారు. గత పదేండ్లుగా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. శ్రీధర్ బాబు, గండ్ర సత్యనారాయణ గెలుపు కోసం కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు నామినేట్ పదవులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మంథని నియోజకవర్గ నుంచి భూపాల పల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అయిదు ప్రకాశ్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశగా ఉన్నారు. మహాదేవ పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కాటారం మండల పార్టీ అధ్యక్షుడు వేముల ప్రభాకర్ రెడ్డి సైతం కార్పొరేషన్ పదవులు కోసం ఎదురు చూస్తున్నారు. మంథని సెగ్మెంట్లో మొత్తం డజన్ మంది తమకు నామినేటి పదవులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చల్లూరు మధు తోపాటు దేవన్తో మరి కొంతమంది నామినేట్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలామంది నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వద్ద తమకు నామినేట్ పదవులు ఇవ్వాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు గెలుపు కోసం గత ఆరు నెలలుగా కష్టపడ్డారు. దీంతో శ్రీధర్ బాబు తమకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఎన్నికల ముందు మంత్రి శ్రీధర్ బాబు సైతం ఈ ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు.