ప్రణీత్ హనుమంతు.. ఇతను ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ప్రముఖంగా వినబడుతోంది. యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్గా కొంత మంది ప్రేక్షకులకు అతడు తెలుసు. నటుడిగా మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు గానీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజనులు, సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల డీజీపీలు కూడా స్పందించారు. అసలు ఎవరితను? ఇతని పేరు వైరల్ కావడానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం..
యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు పాపులర్ అయ్యాడు. అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద.. తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్ హేయమైన, నీచమైన కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యల పట్ల ప్రజలు నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. హీరో సాయి ధరమ్ తేజ్ అందరి కంటే ముందుగా స్పందించాడు. అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ – తెలంగాణ డీజీపీలు స్పందించారు. మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్, ‘శశివదనే’ నిర్మాత అహితేజ బెల్లంకొండ సైతం ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. అతడి మీద చర్య తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 8న అతడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రణీత్తో పాటు అతడి బ్యాచ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.