The number of people admitted to hospitals in Eluru with an elusive problem has crossed 428. Many of them had epileptic symptoms. More than 200 people were discharged after receiving treatment.
ఏలూరులో అంతుచిక్కని సమస్యతో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 428 దాటింది. వీరిలో చాలా మందికి మూర్ఛ తరహా లక్షణాలు కనిపించాయి. చికిత్స పొందిన అనంతరం 200 మందికి పైగా డిశ్చార్జి అయ్యారు.
ఇంత భారీ సంఖ్యలో జనం అనారోగ్యం పాలు కావడానికి కారణాలను అధికారులు నిర్ధరించలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టడానికి ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు
బాధితుల శాంపిల్స్ను సీసీఎంబీకి పంపించామని, 24 గంటల్లో నివేదిక వస్తుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీత బీబీసీకి తెలిపారు.
కాగా, పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్కు చెందిన వైద్య బృందాన్ని ఏలూరుకు పంపిస్తోంది. ఈ బృందం సోమవారం సాయంత్రానికి ఏలూరు చేరుకుంటుందని డాక్టర్ గీత చెప్పారు.
ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు.
మంగళవారం సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ బృందానికి ఆదేశాలిచ్చింది.
కాగా, బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం పరామర్శించారు.
జిల్లా కలెక్టర్ నివేదికలో ముఖ్యాంశాలు..
ఈ వ్యవహారంపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం..
లక్షణాలు :
- 3 – 5 నిమిషాలపాటు మూర్ఛ (ఒక్కసారి మాత్రమే, రిపీట్కాలేదు)
- మతిమరుపు
- ఆందోళన
- వాంతులు
- తలనొప్పి
- వెన్నునొప్పి
- నీరసం
– ఇప్పటివరకూ.. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు
– తీవ్రత తక్కువగా ఉంది
– ఏలూరు మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాల్లోకూడా అస్వస్థతకు గురయ్యారు
– ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దకు అస్వస్థతకు గురయ్యారు
– ప్రత్యేకించి ఫలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది లేదు
– రోజూ మినరల్వాటర్ తాగే వాళ్లు కూడా అస్వస్థతకు గురయ్యారు22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు సాధారణ స్థితినే సూచించాయి.
52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి.
35 సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ శాంపిళ్లను పరీక్షంగా సెల్ కౌంట్ నార్మల్ వచ్చింది. కల్చర్ రిపోర్టు రావాల్సి ఉంది.
45 మంది సీటీ స్కాన్ చేశారు. నార్మల్గానే ఉంది.
9 పాల నమూనాలను స్వీకరించారు. వాటి ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి.
సెల్యులర్ అండ్ మాలిక్యులర్ విశ్లేషణకోసం హైదరాబాద్ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారు. ఫలితం రావాల్సి ఉంది.
బాధితుల్లో చాలామందికి వాంతులు, స్పృహతప్పడం లాంటి లక్షణాలు కనిపించాయని డాక్టర్లు తెలిపారు.
బాధితులను ఏలూరు జనరల్ హాస్పిటల్కు తరలించారు. నగరంలోని డాక్టర్లు, పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నవారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కానీ, వారి అనారోగ్యానికి కారణం ఏంటో అంతుపట్టడం లేదన్నారు.
బాధితుల బ్లడ్ శాంపిళ్లను పరీక్షల కోసం విజయవాడ పంపించినట్లు వైద్యులు చెప్పారు.
విషయం తెలియగానే శాఖ మంత్రి ఆళ్ల నాని బాధితులను చేర్చిన ఆస్పత్రికి వెళ్లారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.
ఒకేసారి ఎక్కువ మంది అనారోగ్యానికి గురైన ప్రాంతాలను డాక్టర్ల బృందం పరిశీలించింది. అక్కడ ఉన్న ప్రతి ఇంట్లో వారు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఏఎన్ఐ వివరించింది.
కోలుకున్న బాధితులు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
శనివారం అర్ధరాత్రి బాధితులకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల బృందం కోలుకున్న 20 మందిని డిశ్చార్జ్ చేశారు.
అస్వస్థతకు గురైనవారిలో ఏలూరు వన్ టౌన్కు చెందిన వారు ఉన్నారు. ఆస్పత్రులలో బాధితులను పరామర్శించిన మంత్రి, వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ పర్యవేక్షణలో ఒక వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆళ్ల నాని సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోని బాధితులకు మెరుగైన వైద్యం అందేలా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయం చేస్తోంది.
ఏలూరులో పలు ప్రాంతాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి, మందులను అందుబాటులో ఉంచామని, డాక్టర్ల బృందం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
వ్యాధి లక్షణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తున్నామని అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అయితే, కలుషిత నీరు తాగడం వల్లే ఏలూరులో 150 మంది జబ్బుపడ్డారని, ప్రజలకు రక్షిత మంచి నీరు అందించే విషయలో ప్రభుత్వం 18 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరగడం విచారకరమని ఆయన అన్నారు.