Homeఅంతర్జాతీయంపాక్​లో మరో ఉగ్రవాది హతం

పాక్​లో మరో ఉగ్రవాది హతం

– హఫీజ్ సయీద్ అనుచరుడిని కాల్చి చంపిన దుండగులు

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్​లోని​ ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గత కొంతకాలంగా కీలక ఉగ్ర నేతలు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. తాజాగా లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ అనుచరుడిని కొందరు వ్యక్తులు కాల్చిచంపారు. కరాచీలో డిసెంబరు 2న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సయీద్‌ అనుచరుడు హంజ్లా అద్నాన్‌ తన ఇంటి బయట ఉండగా.. కొందరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అద్నాన్‌ను పాక్‌ ఆర్మీ రహస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ చికిత్స పొందుతూ అద్నాన్‌ మంగళవారం చనిపోయినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. 2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి అద్నాన్‌ సూత్రధారి.

ఆ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అమరులవ్వగా.. మరో 13 మంది గాయపడ్డారు. ఇక, 2016లో కశ్మీర్‌లోని పాంపోర్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో 8 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై భారత ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అద్నన్‌ తన కార్యకలాపాలు సాగించేవాడని, భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తూ దాడులు చేయించాడని నిఘా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. పాక్‌లో గత కొన్ని నెలలుగా వరుసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఈ వరుస హత్యలతో లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్‌కు కూడా భారీ దెబ్బలు తగిలాయి. ఈ ముఠా అధినేతల దగ్గరి అనుచరులు, టాప్‌ కమాండర్లను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. దీంతో ఈ ఉగ్రమూకలకు భయం పట్టుకుంది. చాలా మంది రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వరుస హత్యలతో పాక్‌ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రత్యర్థులు, ఇతర ఉగ్ర గ్రూపుల పాత్ర, అంతర్గత విభేదాల వంటి కోణాలను పరిశీలిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img