Homeహైదరాబాద్latest Newsఏనుగు దాడిలో మరొకరు బలి

ఏనుగు దాడిలో మరొకరు బలి

ఇదే నిజం, కొమురంభీం ఆసిఫాబాద్ : అసిఫాబాద్‌ జిల్లాలో ఓ ఏనుగు చేస్తోన్న బీభత్సానికి మరొకరు బలయ్యారు. పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన తారు పోషన్న (50) అనే రైతుపై దాడి చేసి హతమార్చింది. పోషన్న మిర్చితోటలో పని చేసుకుంటుండగా ఒక్కసారిగా మీదపడింది. తీవ్రగాయాలపాలైన ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఏనుగును అక్కడినుంచి తరిమేశారు.

మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ అడవుల్లోకి ప్రవేశించిన ఈ ఏనుగు ఇటీవలే బూరెపల్లి గ్రామ పరిధిలో అల్లూరి శంకర్‌ (55)పై దాడి చేసి హతమార్చింది. దీనిపై జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ స్పందించి ప్రజలకు ధైర్యం చెప్పారు. చింతలమానపల్లి, పెంచికాల్ పేట్, దహెగాం, బెజ్జుర్ మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేష్ కుమార్ సూచించారు. ఒంటరిగా ఎవరూ బయటికి రావొద్దని అన్నారు. భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తెలిపారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాల ద్వారా ఏనుగు జాడ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. ఎవరికైనా ఏనుగు కనబడితే దానిపై దాడి చేయొద్దని, వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ జిల్లా అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ కోరారు.

Recent

- Advertisment -spot_img