–అవి ల్యాండ్ క్రుయిజర్లు కాదు.. ఫార్చునర్లు
– కేసీఆర్ ను బద్నాం చేసేందుకు రేవంత్ తప్పుడు ప్రకటన
– రూల్స్ కు విరుద్ధంగా భద్రతా పరమైన విషయాలు రివీల్
– సీఎం సెక్యూరిటీ చూసుకొనేది ఐఎస్డబ్ల్యూ
– విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేయించడం మాములే
– భద్రతా పరమైన విషయాలు బయటపెట్టొచ్చా?
ఇదేనిజం, వెబ్ డెస్క్: ‘కేసీఆర్ 22 ల్యాండ్ క్రుయిజర్లు కొని విజయవాడలో దాచుకున్నారు. మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని.. వాటిని వాడుకుందాం అనుకున్నారు. కానీ కాలేకపోయారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాక ప్రజా ధనం దుర్వినియోగం చేయడం ఎందుకని పాత బండ్లు రిపేర్ చేసి ఇవ్వమన్నాను. చిన్నగా ఓ అధికారి నా చెవిలో ఈ సీక్రెట్ చెప్పిండ్రు.’ అని ఇటీవల ప్రజాపాలన దరఖాస్తుల ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ అన్నారు. అయితే కామెంట్లపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే కేసీఆర్ ను, గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ కామెంట్లు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు విజయవాడలో గత ప్రభుత్వం సిద్ధం చేయించి పెట్టింది ల్యాండ్ క్రుయిజర్లు కాదని.. ఫార్చూనర్ వాహనాలు అని తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ వాహనాలకు కేసీఆర్కు సంబంధం ఉందా?
ఎక్కువలో ఎక్కువ కేసీఆర్ కు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకొని కావాల్సిన వాహనాలకు అధికారులు ఆర్డర్ ఇచ్చివుంటారు. అందులో ఎవరు దాచుకునేది ఏదీ ఉండదు. అన్ని రికార్డుల్లో ఉంటాయి. సంబంధిత అధికార్లకు విషయం తెలిసే ఉంటుంది. నిజానికి ఆ వాహనాలకు కేసీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యమంత్రి భద్రతను ఐఎస్ డబ్ల్యూ ( ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్) పర్యవేక్షిస్తుంది. ఐఎస్డబ్ల్యూకు చెందిన అడిషినల్ డీజీ స్థాయి అధికారి. డీజీ స్థాయి గల రాష్ట్ర హోమ్ సెక్రటరీ ఇంకా ఐఎస్ బీ డీఐజీలు సభ్యులు గల హైపవర్ సెక్యూరిటీ కమిటీ ఎప్పటికప్పుడు వీఐపీల భద్రత, వారికున్న ముప్పు గురించి వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తుంది. ముఖ్యమంత్రికి ఎటువంటి భద్రత కావాలి? ఆయన కాన్వాయ్ లో ఎన్ని వాహనాలు ఉండాలి. వాటిని ఎలా వాడాలి? ఎన్ని వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ చేయించాలి. అన్న విషయాలు మొత్తం ఈ వింగ్ చూసుకుంటూ ఉంటుంది. ఇక ముఖ్యమంత్రికి ఈ వింగ్ మొత్తం మూడు కాన్వాయ్ లను సిద్ధం చేస్తుంది. ముఖ్యమంత్రి పర్యటనల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పడు వీలుగా వీటిని రూపొందిస్తారు. ముఖ్యమంత్రి మాత్రమే కాక.. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ముఖ్యనేతలు రాష్ట్రాలకు వచ్చినప్పుడు సైతం వారికి ఈ వింగ్ కాన్వాయ్ ను అందుబాటులో ఉంచుతుంది. ఇక విజయవాడలో ఈ కాన్వాయ్లను వీటిని రెడీ చేస్తారు. నిజానికి ఒక కాన్వాయ్ లోని మూడు వాహనాలకు మాత్రమే బుల్లెట్ ఫ్రూప్ చేస్తారు. అయితే ఇదంతా సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి కాస్త సీక్రెట్ గా సాగుతుంది. ఒకవేళ బయటకు తెలిస్తే ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఎన్ని వాహనాలు ఉన్నాయి. వాటి కండిషన్ ఏంటి? తదితర వివరాలు ముఖ్యమంత్రి శత్రువులకు, సంఘవిద్రోహశక్తులకు తెలిసే అవకాశం ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం వల్లే ఈ విషయాన్ని నేరుగా మీడియా ముందు రివీల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను చాలా సింపుల్ గా ఉంటానని చెప్పేందుకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తనకు పాత కార్లు అయినా పర్వాలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి సీటులో ఎవరు ఉన్నా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఐఎస్ డబ్ల్యూకు ఉంటుంది. కనక వారు నేరుగా ఈ వ్యవహారం చూసుకుంటారు. రేవంత్ కోరుకున్నంత మాత్రం పాత కార్లను రిపేర్ చేసి అమర్చడం సాధ్యం కాదు.
తెలంగాణ ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ సెక్యూరిటీ
తెలంగాణ ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ భద్రత ఉంటుంది. జడ్ ప్లస్, జడ్, ఎక్స్, వై ఇలా నాలుగు రకాల భద్రత ఉంటుంది. వీటిలో జెడ్ ప్లస్ అనేది టాప్. ప్రధాని, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ భద్రతను కలిపిస్తారు. వీరితో పాటూ పెద్ద పదవుల్లో ఉన్నవారికి, థ్రెట్ ఉన్న వారికి సైతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. అయితే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చే వారికి సంబంధించిన వాహనాలకు సంబంధించిన వివరాలను బహిరంగపర్చడం రూల్స్ కు విరుద్ధం. కానీ రేవంత్ రెడ్డి అనుభవం లేకపోవడమో .. ప్రత్యర్థులను బద్నాం చేయాలన్న తపనతోనే రహస్యంగా ఉంచాల్సిన విషయాలను విలేకరుల సమావేశంలో బహిరంగపరిచారు.
రేవంత్ మదిలో ల్యాండ్ క్రుయిజర్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్చూనర్ వెహికిల్స్ వాడేవారు. అయితే రేవంత్ రెడ్డికి ల్యాండ్ క్రుయిజర్ మీద వెళ్లాలన్న కోరిక ఉందని.. అందుకే ఆయన గత ముఖ్యమంత్రి 22 వాహనాలకు సీక్రెట్ గా విజయవాడలో ఉంచారని చెప్పారన్న వాదన కూడా వినిపిస్తోంది. తాను ఎంతో సింపుల్ ముఖ్యమంత్రినని ప్రజలకు చూపించుకోవాలని రేవంత్ ఆరాటపడుతున్నారు. అయితే తనకేమో ల్యాండ్ క్రుయిజర్లను కాన్వాయ్ లో పెట్టుకోవాలని ఉంది. అందుకే గత ముఖ్యమంత్రి మీద నెపం నెట్టి ల్యాండ్ క్రుయిజర్లను తెప్పించుకోవాలని రేవంత్ అలా అన్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని తెలంగాణ వ్యతిరేక మని పేరున్న టీవీ చానళ్లు మరింత ముందుకెళ్లి బండారం బయట పడడముతో కేసీఆర్ రాత్రికిరాత్రే విజయవాడ లో ల్యాండ్ క్రుయిజర్లను మార్చేసి ఫార్చునర్లను పెట్టారని ఎల్లో వార్తలు లైవ్ లో ప్రసారం చేశాయి.