Homeరాజకీయాలురాబందులు అవసరమా?

రాబందులు అవసరమా?

– యాదాద్రిని ఎంతో అభివృద్ధి చేశాం
– కొండపైకి ఆటోలు వెళ్లేందుకు పర్మీషన్​ ఇస్తాం
– ఐటీ మంత్రి కేటీఆర్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాబందులు మనకు అవసరమా? అని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్​ లీడర్లను దగ్గరకు రానివ్వొద్దని పిలుపునిచ్చారు. రాబందుల్లా రైతులను పీక్కతిన్నోళ్లకు ఓటు వేయొద్దని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్​ ప్రసంగించారు. రాబందుల లెక్క రైతులను పీక్కతిన్నోళ్లు మనకు అవసరమా? అని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 55 ఏళ్లలో సాధ్యం కానిది ఈ 9 ఏళ్లలో బీఆర్ఎస్​ చేసి చూపించిందన్నారు. ఆలేరు బీఆర్ఎస్​ అభ్యర్థి గొంగిడి సునీతకు మద్దతుగా యాదగిరిగుట్టలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ‘యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధిలో కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమే. కొండపైకి ఆటోలు వెళ్లేలా డ్రైవర్లకు డిసెంబర్ 3 తర్వాత శుభవార్త చెబుతాం. కాంగ్రెస్ హయాంలో ప్రజలు కరెంట్‌ కష్టాలతో ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్‌ కాదు.. ఉత్తుత్తి కరెంట్‌. వరిధాన్యం పండించడంలో ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా నంబర్ వన్‌గా ఉంది. తాగు, సాగునీటి కష్టాలు లేవు.’ అని కేటీఆర్​ పేర్కొన్నారు. గొంగిడి సునీతను మళ్లీ గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురాలను మండలాలుగా ప్రకటిస్తాం. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తామని హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img