ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో ప్రమాదవశాత్తూ పడవ మునగడం వల్ల సుమారు 90 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారిక సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడం వల్ల ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్లో గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 15,000 కలరా కేసులు నమోదవ్వగా, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి.