ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడం .. భారీ ఊరేగింపులు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నుంచే విమర్శలు వస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడుకు విభజన సమస్యల కంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడటమే ముఖ్యమని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీజేపీని ముందు పెట్టుకొని తెలంగాణలో బలపడాలని చంద్రబాబు చూస్తున్నారని.. కానీ అది ఎప్పటికీ జరగదన్నారు. పైగా చంద్రబాబుతో కలిస్తే బీజేపీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారని విజయశాంతి తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనడం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.