హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరోపించారు. కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనా సమయంలో ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కయ్యిందని ఆరోపించారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే గానీ ప్రభుత్వంలో కదలిక రావడం లేదన్నారు. పేషెంట్ల దగ్గర అధిక పీజులు వసూలు ఒకట్రెండు ఆస్పత్రులను సీజ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. గణేష్ ఉత్సవాల కారణంగానే కరోనా తీవ్రత పెరిగిందని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. రంజాన్ సమయంలో కరోనా కేసులు తగ్గించి చూపించారని ధ్వజమెత్తారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వెంటనే వారిని ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. రైతు బంధు పథకానికి బీజేపీ వ్యతిరేకం కాదని సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు.