హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకొంది. కొవిడ్-19 నివారణకు ‘వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ అభివృద్ధి చేస్తున్న ‘నాసల్ స్ప్రే వ్యాక్సిన్’(ముక్కు ద్వారా ఇచ్చే టీకా) తయారీ, పంపిణీకి సంబంధించిన హక్కులను చేజిక్కించుకుంది. ఈ ఒప్పందంతో అమెరికా, జపాన్, ఐరోపా మినహా మిగిలిన ప్రపంచ దేశాల్లో ఈ టీకా పంపిణీ బాధ్యతలు భారత్ బయోటెక్ చేతికి వచ్చాయి.
వేగంగా పంపిణీ
వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో తమకున్న అనుభవం.. కరోనా వ్యాక్సిన్ను ప్రజల దగ్గరకు వేగంగా చేర్చడంలో ఉపయోగపడుతుందని సంస్థ ఛైర్మన్, ఎండీ డా.కృష్ణ ఎల్లా తెలిపారు. సంప్రదాయ ఇంజెక్షన్ టీకాల కంటే నాసల్ స్ప్రే వ్యాక్సిన్లను అందించడం చాలా సులభమని, వ్యాక్సిన్ పంపిణీకి అయ్యే ఖర్చు తగ్గే అవకాశం ఉందన్నారు.
ముక్కు ద్వారా నేరుగా..
ఈ వ్యాక్సిన్ తొలిదశ ప్రయోగాలు ప్రస్తుతం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి. నాసల్ స్ప్రే వ్యాక్సిన్ కొవిడ్-19ను నివారించడంతో పాటు వైరస్ వ్యాప్తిని అరికడుతుంది. ముక్కు ద్వారా ఇవ్వడం వల్ల ముక్కుతో పాటు, గొంతులో ఉండే వైరస్పై ఇది నాశనం చేస్తోందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ కొవాగ్జిన్ అనే టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది.