ఇదే నిజం, తెలంగాణ: ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట.. అలాంటప్పుడు ఎందుకు వేయాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో సమాధానం చెప్పాకే మోడీ తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టాలన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీని బహిష్కరించాలని.. ఈ ఎన్నికల్లో పడగొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డికి మద్దతుగా ఆదివారం ఎల్బీనగర్, వనస్థలిపురంలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం ప్రసంగించారు.
ఈ నియోజకవర్గం నుంచి సునీతకు 30వేల మెజార్టీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హయత్నగర్ వరకు మెట్రోను విస్తరించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. వరద ముంపు సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ‘ఈటల రాజేందర్ ఏనాడైనా మీ సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారా?. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బండి రాలేదు గుండు రాలేదు. కానీ, ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు’ అని సెటైర్ వేశారు. తెలంగాణను నిండా ముంచేందుకు ప్రధానిమోడీ ప్రయత్నిస్తున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కారు తూకానికి వెళ్లిందని.. ఇక తిరిగి రాదని ఆయన విమర్శించారు.