Boinapalli vinod kumar:వరంగల్ సభలో ప్రధాని మోడీ పరోక్షంగా ఓటమిని అంగీకరించారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోయారన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు వరాలు జల్లు కురిపించే ప్రధాని తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టే నిధులేమీ ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. ప్రధాని మోడీతోసహా బీజేపీ నేతలంతా గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వారసత్వంపై మోడీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
బీజేపీలో 200 మంది నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. కొన్ని సినిమాలకు సంబంధించి ట్రైలర్స్ మాత్రమే విడుదలవుతాయి.. సినిమాలు మాత్రం బయటకు రావు అలాగే బీజేపీ పరిస్థితి కూడా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని పేర్కొన్నారు.