– ఎన్సీఈఆర్టీ కీలక సిఫార్సులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్కూల్ బుక్స్లో మార్పులు చేర్పుల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కమిటీ కీలక సిఫార్సులు చేసింది. చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ సబ్జెక్టులోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ‘ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలో ఉన్న చరిత్రను ‘ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు’గా విభజించారు. అయితే, మన చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. క్లాసిక్ పీరియడ్ (సంప్రదాయ చరిత్ర), మధ్య యుగం, బ్రిటిష్ కాలం, ఆధునిక భారతం.. ఇలా నాలుగు భాగాలుగా వర్గీకరించి చరిత్రను బోధించాలి. క్లాసిక్ పీరియడ్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలి.
రాముడంటే ఎవరు? ఆయన ఉద్దేశాలు ఏంటీ? అనేది విద్యార్థులు తెలుసుకోవాలి. ఇతిహాసాల గురించి విద్యార్థులు కొంతవరకైనా తెలుసుకోగలగాలి’అని ఈ కమిటీ చైర్మన్ సీఐ ఐజాక్ వెల్లడించారు. ఇక, చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలనకు మరింత ఎక్కువగా స్థానం కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి పాఠాలను చేర్చాలని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాయాలని ప్రతిపాదించింది. పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు ‘భారత్’ పేరును ఉపయోగించాలని ఇటీవల ఈ కమిటీ సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. చరిత్ర పాఠ్యాంశాల్లో కమిటీ సిఫార్సుల గురించి మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘పాఠ్యపుస్తకాల్లో కొత్త సిలబస్ రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వివరాలు ఇప్పుడే చెప్పలేం’అని వెల్లడించింది. ప్యానెల్ సిఫార్సులకు ఎన్సీఈఆర్టీ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు