India to London bus : లండన్ కు బస్ జర్నీ.. టికెట్ రేటెంతో తెలుసా
India to London bus : బస్సు జర్నీ అంటే కొంత మంది పడిచస్తరు.
అలాంటిది 18 దేశాల గుండా బస్సులో లండన్ కి వెళ్లడం అంటే ఇక ఎగిరి గంతేస్తారు.
70 రోజులు ప్రయాణం.. 20 వేల కిలోమీటర్ల దూరం.‘బస్ టు లండన్’ పేరిట ‘అడ్వెంచర్స్ ఓవర్లాండ్’ నిర్వాహకులు ఏర్పాటు చేసిన రికార్డు ట్రిప్ కు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున టూరిస్టులు ఎగబడుతున్నారు.
తమకు సీటు కేటాయించాలంటూ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.
ఈ సంస్థ ఇప్పటిదాకా 6 ఖండాల్లోని 70 దేశాల్లో రోడ్డు మార్గంలో వివిధ ట్రిప్పులు విజయవంతంగా పూర్తి చేశారు.
ఇరవై మందికే అవకాశం
స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘బస్ టు లండన్’ ప్రకటన వెలువడగానే దేశవ్యాప్తంగా ఈ ట్రిప్ గురించి ఆసక్తి మొదలయ్యింది.
కేవలం 20 సీట్లు ఉన్న ఈ బస్సులో అంత దూరం ప్రయాణించడానికి తగినట్టుగా సకల సౌకర్యాలు నిర్వాహకులు సమకూర్చడం విశేషం.
ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ఖరీదు అక్షరాల రూ.15 లక్షలు.
ఇక ఆయా దేశాల్లో ఇతర వింతలు, విశేషాలు చూసేందుకు ఎక్స్ట్రా ఖర్చు భరించే స్థితిలో ఉన్నవారు మాత్రమే ఇందులో ప్రయాణం చేయొచ్చు.
రూట్ మ్యాప్
బస్సు ఢిల్లీ నుంచి బయలు దేరి లక్నో, గౌహతి, ఇంఫాల్ మీదుగా మయన్మార్లోకి ప్రవేశిస్తుంది.
అక్కడి నుంచి థాయిలాండ్కు అక్కడినుంచి లావోస్ మీదుగా చైనా భూభాగంలోకి బస్సు ప్రవేశిస్తుంది.
చైనా నుంచి కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ దేశాల మీదుగా రష్యా చేరుకుంటుంది.
రష్యా నుంచి బయల్దేరిన బస్సు బయలుదేరి లాట్వియా, లుథియానా, పోలండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ మీదుగా మొత్తానికి 70 రోజుల్లో 20 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి లండన్కు చేరుకుంటుంది.
కరోనా కలకలం ముగిసాక ప్రయాణ ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.