హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్కు మంజూరైన ఐ.టీ.ఐ.ఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తిరిగి ఇప్పుడు నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తామని బీజేపీ నాయకులు అంటున్నరని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనగా.. దీనిని తిప్పకొడుతూ మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.
టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ అభ్యర్థులకు మద్దతుగా పాటిగడ్డలో మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా కోరారు.
ఢిల్లీ టూరిస్టులకు వెల్కం
‘‘నగరానికి వస్తున్న ఢిల్లీ టూరిస్టులకు వెల్కం. కానీ వస్తూ వస్తూ వరద సాయం తెస్తరేమో అని ఎదురుచూశాం. ఒక్కరంటే ఒక్కరూ కూడా ఈ విషయంలో స్పందించలేదు’’ అని కేటీఆర్ అన్నారు.
పేదవారికి సాయం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంటే అమ్మ పెట్టదు అడ్డుక్కు తిననీయదు అన్నట్టు బీజేపీ తీరు ఉందన్నారు.
వరదల భారిన పడినవారిలో ఇప్పటికే 6 లక్షల 64 వేల కుటుంబాలకు సాయం అందించాం. మిగతావారిని డిసెంబరు 7 నుంచి ఆదుకుంటామన్నారు.
తమది నిజాం సంస్కృతి అంటున్నరు. కానీ హైదరాబాద్ సంస్కృతి గాంధీ-జమునా తెహజీబ్ అని 1920లోనే మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఒక్కసారి చూడాలన్నారు.
వాళ్లకు పంచాయతీలే కావాలి
అబద్దపు ప్రచారాలకు ప్రజలు ఆగం కావొద్దన్నారు. విషయం లేనివాళ్లే విషం చిమ్ముతారన్నారు. హిందు, ముస్లిం, సిక్కులు కలిసి ఉండటం బీజేపీ వాళ్లకు నచ్చదన్నారు.
బీజేపీ వాళ్లు ఇది కూలగొడతం, అది కూలగొడతం అంటున్నరు. తామేమో డ్రైనేజీలు కడతం, రోడ్లు కడతం, చెరువులు బాగుచేస్తం, లైట్లు బాగుచేస్తం, పిల్లలకు కొలువులు వచ్చేలా చూస్తాం, సీసీ కెమెరాలు పెడతామంటుంటే.. వాళ్లేమో కూలగొడతం అంటున్నరన్నారు. ఓటేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరారు.