గత కొద్ది కాలంగా సరిహద్దుల్లో భారత్ను చికాకు పెట్టేలా ఘర్షణ పడుతూనే భారత్పై చైనా సైబర్ దాడులు కూడా చేస్తోందని, భారతదేశంలోనే సుమారు 10వేలమంది ప్రముఖులు, సంస్థల డేటాపై చైనా నిఘా పెట్టిందని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక కథనంలో రాసింది. చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధమున్న జిన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సంస్థ ఈ నిఘా వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మమతా బెనర్జీ మొదలుకొని కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్మీ, నేవీ,ఎయిర్ఫోర్స్ అధినేతలు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, మీడియా అధిపతులు, నటులు ఆఖరికి పేరుమోసిన నేరగాళ్లు కూడా ఈ నిఘా నేత్రం కింద ఉన్నారని ఈ కథనం తెలిపింది.
కేవలం ప్రభావవంతమైన నేతలు, అధికారులే కాక పలు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డేటాపై కూడా చైనా సంస్థ నిఘా పెట్టినట్లు ఈ కథనం వెల్లడించింది. ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటా బేస్ (OKIDB) పేరుతో ఈ నిఘా సంస్థ పని చేస్తున్నట్లు, అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ దేశాల నుంచి డేటా నెట్వర్క్ సైంటిస్టుల ద్వార సమాచారాన్ని సేకరిస్తోందని పేర్కొంది.